ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తాడిపత్రిని అభివృద్ధి చేస్తుంటే.. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. గురువారం తాడిపత్రి పట్టణ పరిధిలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జేసీ సోదరులు 35 సంవత్సరాలు అధికారంలో ఉన్నా తాడిపత్రితోపాటు ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 2007లో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు అనుమతులు మంజూరైనా.. ఇప్పటివరకు విస్తరణకు నోచుకోలేకపోయేందుకు మీరు కారణం కాదా..? అని ప్రశ్నించారు. 'అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపినా.. మరలా టీడీపీ కౌన్సిలర్లతో వ్యతిరేకంగా మాట్లాడించడం జేసీ సోదరులకి చెల్లుతుంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడిపత్రికి ఎక్కువ నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం మీడియా ముంగిట గగ్గోలు పెట్టి తన భజన చేసుకుంటున్నారు. గ్రామాలలో ప్రశాంత వాతావరణమే మా లక్ష్యం..' అని ఎమ్మెల్యే అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి దమ్మూ ధైర్యం ఉంటే తాడిపత్రి పట్టణంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల జాబితాను అందివ్వాలని.. ఆయనతో పాటే వెళ్లి కూల్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. అనంతరం ఆయన ముచ్చుకోట గ్రామంలో సచివాలయాన్ని సందర్శించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి దమ్మూ ధైర్యం ఉంటే తాడిపత్రి పట్టణంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల జాబితాను అందివ్వాలని.. ఆయనతో పాటే వెళ్లి కూల్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. అనంతరం ఆయన ముచ్చుకోట గ్రామంలో సచివాలయాన్ని సందర్శించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.