కొండలా పెరిగిపోతున్న అప్పులను తీర్చడం కోసం కాన్పూర్కు చెందిన ఓ జంట ఐదునెలల పసికందును విక్రయించింది. 40 ఏళ్ల ఖలీద్, 35 ఏళ్ల సైదా దంపతులు బాబూపూర్వ ప్రాంతంలో ఓ టీస్టాల్ నడుపుతూ జీవనం సాగించేవారు. వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి వారు రూ.50 వేలను అప్పుగా తీసుకున్నారు. కానీ చాలా కాలమైనప్పటికీ తిరిగి ఇవ్వకపోవడంతో వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. డబ్బులు చెల్లించాలంటూ.. వారు ఖలీద్ దంపతులను నానా దుర్భాషలాడారు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో వారు గత జూలై 20న 1.6 లక్షలకు తమ ఐదు నెలల కుమారుడు ఫైజాన్ను ఓ వ్యాపారికి అమ్మేశారు. రెండు రోజులు గడిచే సరికి తమ బిడ్డ తమ వద్దే ఉంటే బాగుండనే ఆలోచన వారికి కలిగింది. దీంతో తమ పిల్లాడు కనిపించకుండా పోయాడంటూ జూలై 22న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ ఎస్పీని కలిసిన వారు.. జూలై 20న ఇంటి ముందు ఆడుకుంటున్న తమ పిల్లాడు కనిపించకుండా పోయాడని నమ్మబలికారు. వారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు పిల్లాడి ఆచూకీ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. పిల్లాణ్ని కొనుగోలు చేసిన వ్యాపారిని రాత్రి పూట కాన్పూర్ బస్టాండ్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అతణ్ని విచారించగా, పిల్లాడి అమ్మకం విషయం వెలుగులోకి వచ్చింది. అతడు చెప్పిన విషయాల ఆధారంగా ఖలీద్ ఇంట్లో సోదా చేయగా, రూ.60 వేలు లభించాయి. దీంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఖలీద్ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉండటంతో, అప్పులు తీర్చడం కోసం చిన్నవాడైన ఫైజాన్ను అమ్మేశారని పోలీసులు తెలిపారు.
అప్పులు తీర్చేందుకు పసివాణ్ని అమ్మేసి..
కొండలా పెరిగిపోతున్న అప్పులను తీర్చడం కోసం.. పిల్లాణ్ని విక్రయించిన ఓ జంట తిరిగి పిల్లాణ్ని సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది..
TNN 8 Sep 2016, 1:22 pm