అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం చేసుకున్న తరువాత ఇప్పటి వరకు కలిసి నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అభిమానులకు ఎదురుచూపులకు తెరపడింది. అక్కినేని వారు తమ అభిమానులకు శుభవార్త చెప్పేశారు. నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో ఈ బ్యానర్పై నాని హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రొడక్షన్లో రెండో ప్రాజెక్టుగా చైతు, సమంతల చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘నిన్నుకోరి’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో సోమవారం ఉదయం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై స్క్రిప్టును తన చేతుల మీదుగా దర్శకుడికి అందజేశారు. నాగ చైతన్య, సమంత జంటగా ఇది నాలుగో చిత్రం. అలాగే నాగ చైతన్యకు ఇది 17వ సినిమా. ఇతర తారాగణం, సాంకేతిక విభాగం వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.
దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, రావు రమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత సారధ్యం వహించనున్నారు. ఆగస్టు రెండోవారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కాగా, ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.
పెళ్లి తరువాత చైతు, సామ్ తొలి చిత్రం.. ప్రారంభించిన నాగ్
అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం చేసుకున్న తరువాత ఇప్పటి వరకు కలిసి నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
Samayam Telugu 23 Jul 2018, 1:42 pm