ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం రాయల్ సర్కిల్ సమీపంలో నివాసముండే అయ్యన్న, శారద దంపతుల కుమారుడు అఖిల్ (22) బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసం ఆన్లైన్ లోన్ యాప్ల నుంచి సుమారు 60వేల రూపాయల వరకు రుణం తీసుకున్నాడు. అయితే సకాలంలో లోన్ చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు ఫోన్లు చేస్తూ వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన అఖిల్ బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్నేహితులకు ఫోన్ చేసి తాను అందరికీ దూరంగా వెళ్లిపోతున్నానని చెప్పి ఆ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాడు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై గుత్తి జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధించి తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Read Latest and Telugu News