యాప్నగరం

చింతమనేనికి షాకిచ్చిన పోలీసులు.. తాడిపత్రిలో హైడ్రామా!

Chintamaneni Prabhakar: తాడిపత్రిలో రాజకీయం వేడెక్కింది. జేసీ, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయుల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తాజాగా అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు.

Samayam Telugu 24 Dec 2020, 9:48 pm
తాడిపత్రిలో హైడ్రామా కొనసాగుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం హడలిపోతున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ గ్రూపుల మధ్య వార్ జరుగుతోంది. తాజాగా అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయణ్ని అడ్డుకున్నారు. జనవరిలో జరిగే తన కుమార్తె వివాహానికి జేసీ ఫ్యామిలీని ఆహ్వానించేందుకు అక్కడికి వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. కానీ, ఆయనకు అనుమతి నిరాకరించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Anantapur politics


పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో చింతమనేనిని జేసీ ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో అక్కడ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. కాసేపటి తర్వాత ఆయన ఆహ్వాన పత్రిక అందజేసి వెళ్లారు.

జీసీతో చింతమనేని ప్రభాకర్


అసలేం జరిగింది?
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ గ్రూపుల మధ్య వార్ జరిగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆగ్రహంతో నేరుగా జేసీ ఇంటికి వెళ్లారు. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జేసీ అనుచరులపై మండిపడ్డారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులపై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో జేసీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేనట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చీలో కూర్చోగా, ఆయన లేచిన వెంటనే జేసీ అనుచరులు ఆ కుర్చీని తగలబెట్టినట్లు సమాచారం. పెద్దారెడ్డి వచ్చిన విషయం తెలిసి జేసీ వర్గీయులు మరి కొంత మంది అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభాకర్ రెడ్డి ఇంటి సమీపంలో రెండు వర్గాలకు చెందిన వాళ్లు రాళ్లు రువ్వుకున్నారు. ఫ్యాక్షన్ సినిమా తరహాలో అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి.

పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని చేయి దాటిపోతుండటంతో లాఠీఛార్జ్ చేశారు. అయినా.. పట్టించుకోకుండా ఇరు వర్గాలు ఘర్షణకు దిగడం గమనార్హం. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ విషయం తెలియడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.

Also Read: తూచ్.. రాత్రి పూట క‌ర్ఫ్యూ లేదు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.