యాప్నగరం

బాలకృష్ణను పబ్లిక్‌గా అంత మాట అనేసిన బీసీ నేత.. హిందూపురం సభలో ఉద్రిక్తత

హిందూపురాన్ని జిల్లా చేయాలంటూ అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బాలయ్యను బీసీ నేత దూషించారంటూ టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు.

Samayam Telugu 4 Apr 2022, 11:13 pm
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఓ బీసీ సంఘం నాయకుడు పబ్లిక్‌గా విమర్శించంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. దీంతో అఖిలపక్ష సమావేశం చివరికి, ఉద్రిక్తతలకు దారి తీసింది. నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురాన్ని కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించక పోవడంపై అఖిలపక్షం నాయకులు సోమవారం నిరసనకు దిగారు.
Samayam Telugu నందమూరి బాలకృష్ణ (ఫైల్ ఫొటో)


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక ప్రకటన తర్వాత శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో సోమవారం నుంచి పరిపాలన ప్రారంభమవడంతో హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, పలు కుల సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ చలపతి మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడానికి ముగ్గురు మూర్ఖులే కారణమని వ్యాఖ్యానించారు. ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి అధికార వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అని, రెండో వ్యక్తి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అని, మూడో వ్యక్తి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, నందమూరి బాలకృష్ణను మూర్ఖుడని అనడంతో అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన అభిమానులు ఒక్కసారిగా రగిలిపోయారు. చలపతి వైపు తెలుగు తమ్ముళ్లు దూసుకుపోయారు. బాలకృష్ణను మూర్ఖుడనడం తప్పనీ, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.