యాప్నగరం

Ysrcp Leaders: ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులకు ప్లాన్.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

Ysrcp Leaders: ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన దాడి తరహాలో మళ్లీ దాడులు జరగొచ్చని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జనసేన కార్యకర్తలు దాడులకు ప్లాన్ చేస్తోన్నట్లు ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. టెక్కలిలోని జనసేన కార్యాలయంపై దాడికి ప్రతీకార చర్యగా జనసేన కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడికి సంబంధించి సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. రోజా, అంబటి, అమర్‌నాథ్ జాబితాలో ఉన్నట్లు సమాచారం

Samayam Telugu 23 Oct 2022, 11:58 am

ప్రధానాంశాలు:

  • మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడికి జనసేన కార్యకర్తలు ప్లాన్
  • హెచ్చరించిన ఇంటెలిజెన్స్ విభాగం
  • అప్రమత్తంగా ఉండాలంటూ నేతలకు అలర్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu roja and ambati
రోజా, అంబటి రాంబాబు
ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలను ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశముందని, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు జరిగే అవకాశముందనే సమాచారం తమ దృష్టికి వచ్చిందని, నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ పోలీసులు సూచించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి ఘటన దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. కార్యాలయంలోకి 20 మంది చొచ్చుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు జనసేన వర్గాల నుంచి వినిపిస్తోంది.
జనసేన పార్టీ కార్యాలయంపై ప్రతీకారచర్యగా ఆ పార్టీ కార్యకర్తలు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. కొంతమంది జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో దాడులకు సంబంధించి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని, అందువల్ల మంత్రులు, వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండటం మంచిదని ఇంటెలిజెన్స్ పోలీస్ వర్గాలు సూచించాయి. తమ సమస్యలపై ఆర్జీలు ఇచ్చే సాకుతో మంత్రులు, ఎమ్మెల్యేలపై జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు.

ఇంటెలిజెన్స్ పోలీసులు హెచ్చరించిన వైసీపీ నేతల జాబితాలో గుడివాడ అమర్‌నాథ్, బొత్స సత్యానారాయణ, రోజా, అంబటి రాంబాబు, కొట్టు సత్యానారాయణ, జోగి రమేష్, దాడిశెట్టి రాజా, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, జక్కంపూడి రాజా, పేర్ని నాని, గ్రంథి శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్, గొర్ల కిరణ్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడి ఘటన ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపింది. రాళ్లతో మంత్రులపై కొంతమంది ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. అయితే జనసేన కార్యకర్తలు ఈ దాడికి తెగబడ్డారంటూ కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన నేతలకు బెయిల్ వచ్చేంతవరకు విశాఖలోనే ఉండిపోయారు.

ఇప్పుడు మరోసారి వైసీపీ నేతలపై దాడులు జరిగే అవకాశముందనే వార్తలు సంచలనంగా మారాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరు ఎప్పుడు దాడి చేస్తారేమోననే భయం వారిని వెంటాడుతోంది. దీంతో తమ సెక్యూరిటీని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అలర్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదు. తమ దగ్గరకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజల గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే కలుస్తున్నారు. కొద్దిరోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు జనసేన నేతలు, కార్యకర్తల నుంచి సెగ తప్పేలా లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.