యాప్నగరం

సొంత చెల్లెళ్లను బాధపెట్టి ఏం సాధిస్తావ్.. జగన్ రెడ్డి: మాజీ మంత్రి ఆది

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌కు కేంద్రం సరైన సమయంలో చెక్ పెడుతుందని వ్యాఖ్యానించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 29 Sep 2022, 8:40 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కీలక వ్యక్తి (కింగ్‌ పిన్‌)గా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన తరుణంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బండారం కూడా త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో ఎవరూ తప్పించుకోలేరన్నారు. వచ్చే నెలలోనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు.
Samayam Telugu ఆదినారాయణరెడ్డి (ఫైల్ ఫొటో)


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెళ్లు షర్మిల, సునీత, తల్లి విజయమ్మను బాధపెట్టి ఏం సాధిస్తారని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఎదురు మాట్లాడినా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని.. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో పర్యటించిన ఆదినారాయణరెడ్డి.. ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాత్రపై ఈడీ కూడా దర్యాప్తు సాగిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఆదినారాయణరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధాని అమరావతికి అగ్గి, పోలవరానికి పొగపెట్టారన్నారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పేరు తొలగించే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం అందజేసే పథకాలకు కూడా జగన్‌ తన పేరు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. సీఎం దొంగ నాటకాలను బయటపెట్టడానికి బీజేపీ ప్రజాపోరు సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు సరైన సమయంలో కేంద్రం చెక్‌ పెడుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ నిర్ణయంతో ఉన్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పరిస్థితులు మారుతాయని అభిప్రాయపడ్డారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.