యాప్నగరం

Kadapa: అధికార పార్టీ నాయకులపై తిరగబడ్డ రైతులు

Kadapa: భూఆక్రమణకు ప్రయత్నించి.. బతుకుదెరువును లాక్కుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ.. అధికారపార్టీ నాయకులపై రైతులు తిరగబడ్డారు. కళ్లలో కారంపొడి చల్లి కర్రలతో వెంబడించి కొట్టారు. దీంతో ఆగ్రహించిన ఆ నాయకులు రైతు ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గుండాపురంలో గురువారం జరిగింది. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 10 Mar 2023, 11:07 am

ప్రధానాంశాలు:

  • అధికార పార్టీ నాయకులపై తిరగబడ్డ రైతులు
  • కళ్లలో కారం చల్లి.. కర్రలతో దాడి చేసిన వైనం
  • కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu attack on YCP leaders
వైసీపీ నాయకుడిపై దాడి
Kadapa: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గుండాపురంలో.. వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుడు బేరి రమణారెడ్డికి 281 సర్వే నంబరులో పొలం ఉంది. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన బత్తల సిద్దయ్యకు ఎసైన్‌మెంట్ కమిటీ 340 సర్వే నంబరులో రెండెకరాలు ఉంది. దాంట్లో ఆయన పత్తి పంటను సాగు చేశారు. అయితే.. ఈ భూమిపై రమణారెడ్డి, సిద్దయ్య మధ్య వివాదం తలెత్తింది. రమణారెడ్డి పొక్లెయిన్‌, ట్రాక్టరుతోపాటు ఇనుప కంచెతో పొలం వద్దకు చేరుకున్నారు.
ఆయన తోపాటు నేలటూరువాసి కొండా వెంకటరామిరెడ్డి, చౌదరివారిపల్లె సర్పంచి పెద్దిరెడ్డి ఓబులరెడ్డి ఉన్నారు. బీమఠం-బద్వేలు రహదారి నుంచి పొలానికి వెళ్లేందుకు పొక్లెయిన్‌తో దారి చేస్తుండగా.. బత్తల సిద్దయ్య, అతని అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంటో మాటామాటా పెరిగింది. వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సిద్దయ్య, అతని అనుచరులు.. కారం పొడి చల్లుతూ కర్రలతో దాడి చేశారు.

ఈ ఘటనలో బేరి రమణారెడ్డి, కొండా వెంకటరామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పెనుగులాటలో బత్తల సిద్దయ్య తండ్రి బత్తల వెంకటయ్య, రామకృష్ణ, లక్షుమ్మ, పెంచలమ్మకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బత్తల సిద్దయ్య, వారి అనుచరులను స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత రమణారెడ్డి వర్గీయులు సిద్దయ్యతోపాటు ఆయన తండ్రి వెంకటయ్య ఇంటిపై దాడిచేశారు.

ఇంట్లో గర్భిణిగా ఉన్న సిద్దయ్య భార్య సాలమ్మను బయటకు పంపించి.. ఇంటి పైకప్పు సిమెంటురేకులు ధ్వంసం చేశారు. టీవీ, బీరువా, కూలర్‌, కుర్చీలను విరగ్గొట్టారు. దీంతో సాలమ్మ బిక్కుబిక్కుమంటూ గడిపారు. తన భర్తను చంపేస్తామంటూ బెదిరించారని వాపోయారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.