కర్నూలు: ఆర్టీసీ బస్సులో డ్రైవర్ను చూసి ప్రయాణికుల కేకలు.. వెంటనే తేరుకుని, ఏమైందంటే
ఆదోని బస్టాండు నుంచి శనివారం ఉదయం 25 మందితో ఆర్టీసీ బస్సు మేళిగనూరుకు బయలు దేరింది. మార్గ మధ్యలో కుప్పగల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు పెద్ద కుదుపునకు గురైంది.
Samayam Telugu 1 Mar 2021, 8:19 am
ప్రధానాంశాలు:
- బీపీ రావడంతో కుప్పకూలిన డ్రైవర్
- డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం
- 25మంది ప్రయాణికులు సురక్షితం
కర్నూలు జిల్లాలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. డ్రైవర్ అప్రమత్తతో, సమయ స్ఫూర్తితో 25మంది సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని బస్టాండు నుంచి శనివారం ఉదయం 25 మందితో ఆర్టీసీ బస్సు మేళిగనూరుకు బయలు దేరింది. మార్గ మధ్యలో కుప్పగల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు పెద్ద కుదుపునకు గురైంది.. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ లక్ష్మన్న.. డ్రైవర్ బసయ్య వైపు చూశారు. ఆయన డ్రైవింగ్ సీట్లోనే కుప్పకూలడం గమనించారు. అతడ్ని అప్రమత్తం చేసేందుకు పెద్దగా కేకలు వేశాడు. బస్సు ప్రమాదంలో ఉందని గమనించిన ప్రయాణికులు కూడా డ్రైవర్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి కేకలు వేశారు. వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎక్స్లేటర్పై కాలుతీసి బ్రేక్పై వేశాడు. బస్సు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది.. కండక్టర్ వెంటనే 108కు సమాచారమిచ్చి అతడ్ని ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బసయ్యకు ఒక్కసారిగా బీపీ పెరగడంతో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన డాక్టర్లు ఆయనకు చికిత్స చేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.