యాప్నగరం

ఆత్మకూరులో ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు 62 శాతానికి పైగా పోలింగ్

Nellore: ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్లో ఉన్న ఓటర్లను 6 గంటల తర్వాత కూడా ఓటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఈ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 62 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. కొన్ని చోట్ల బీజేపీ, వైసీపీ మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 23 Jun 2022, 9:11 pm
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లందరినీ అధికారులు ఓటింగ్‌కు అనుమతి ఇచ్చారు. కొన్ని చోట్ల బీజేపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆత్మకూరు ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 62 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5.30 గంటల వరకు ఆత్మకూరులో 62.88 శాతం, చేజర్లలో 62.5 శాతం, సంగంలో 65.52 శాతం, ఏఎస్‌ పేటలో 65.75 శాతం, అనంతసాగరంలో 64.68 శాతం, మర్రిపాడులో 63.68 శాతం పోలింగ్‌ నమోదైంది.
Samayam Telugu ఆత్మకూరు ఉపఎన్నికలో ఓటేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
Atmakur by election in Andhra Pradesh


ఈ ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కన్నుమూయడంతో ఆత్మకూరు స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టలేదు. ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి భరత్ కుమార్, బీఎస్‌పీ నుంచి ఎన్ ఓబులేసు సహా మరో 5 మంది గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.