యాప్నగరం

అధికార అహంతో పొంగిపోవద్దు.. సొంత పార్టీ కార్యకర్తలకే వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

Samayam Telugu 6 Dec 2021, 9:31 pm
మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ప్రజలు వైఎస్సార్‌సీపీకి వంద శాతం సీట్లతో విజయం కట్టబెట్టారని.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రతీ కార్యకర్త నిలబెట్టుకోవాలంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయ సందర్శనలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ రూరల్ కార్యాలయం ఇన్‌చార్జి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం సచివాలయాన్ని సందర్శించారు.
Samayam Telugu కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. అధికారమనే అహంతో పొంగిపోకుడదని.. అధికారం ఇచ్చారని ఇష్టారీతిగా వ్యవహరించొద్దంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయని వారి మనస్సులు కూడా గెలుచుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలంటూ పిలుపునిచ్చారు.

పార్టీ కోసం పనిచేయని వారిని కూడా దగ్గరికి తీసుకుంటూ సర్పంచ్‌లు పాలన చేయాలని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామాల్లో ఎవరూ తగాదాలు పెట్టుకోవద్దని.. ఎందుకంటే గొడవ ప్రారంభమే మన చేతుల్లో ఉంటుందని.. అది ఎంత దూరం వెళ్తుంది అనేది ఎవరూ చెప్పలేరంటూ అవగాహన కల్పించారు. గొడవల్లో చిక్కుకుని చిన్న చిన్న కుటుంబాలు చితికిపోతున్నాయని.. పోలీస్ స్టేషన్లు, లాయర్ల చుట్టూ తిరిగి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకోవద్దంటూ కోటంరెడ్డి హితవు పలికారు.

రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో నువ్వా నేనా అనేలా పోరాడుతారని.. నగరాల్లోనైనా.. గ్రామాల్లోనైనా రాజకీయ పరమైన విభేదాలు గొడవలకు దారితీస్తాయని.. గొడవలు వచ్చినప్పుడు గ్రామం దాటి పోకుండా.. స్థానికంగానే పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి హితవు పలికారు. గ్రామాల్లో పార్టీల వాతావరణం లేకుండా అన్నా, అక్క, తమ్ముడు, మామా అంటూ పిలుచుకుంటూ ఒక కుటుంబంలా కలిసిపోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.