యాప్నగరం

పిల్లలను కాపాడి తల్లులు మృతి.. నెల్లూరులో విషాదం

Mothers died saving Children: ఇద్దరు పిల్లలను కాపాడి తల్లులు మృతి చెందారు. నెల్లూరు నగరంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు నీటి గుంటలో పడిపోయారు. వారిని రక్షించేందుకు ఇద్దరు తల్లులు నీటి గుంటలోకి దూకారు. పిల్లలను కాపాడారు. ఆ తర్వాత బయటకి రాలేకపోయారు. బురదలో కూరుకుపోయి, నీటిలో మునిగిపోయి దుర్మరణం పాలయ్యారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 31 May 2023, 9:33 pm

ప్రధానాంశాలు:

  • ఆడుకుంటూ నీటి గుంటలో పడిపోయిన చిన్నారులు.
  • వెంటనే గుంతలోకి దూకి పిల్లలను కాపాడిన తల్లులు.
  • ఆ తర్వాత పైకొచ్చే మార్గం లేక, సాయం చేసేవాళ్లు లేక.. విషాదం!
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu drown
ప్రతీకాత్మక చిత్రం
నీటి గుంటలో పడిన తమ పిల్లలను రక్షించి ఇద్దరు తల్లులు దుర్మరణం పాలయ్యారు. హృదయ విదారకరమైన ఈ ఘటన నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీలో బుధవారం (మే 31) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్నానది రివిట్‌మెంట్‌ వాల్‌ నిర్మాణం కోసం జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆ గుంతల్లో నీరు చేరాయి. బుధవారం సాయంత్రం ఆడుకుంటూ అటుగా వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ ఓ గుంతలో పడిపోయారు. అది గమనించిన ఆ ఇద్దరు చిన్నారుల తల్లులు షాహినా, షబీనా వెంటనే గుంత వద్దకు పరుగెత్తుకొచ్చి అందులో దూకారు. చిన్నారులను బయటకుతీసి కాపాడారు కానీ, వారిద్దరూ పైకి రాలేకపోయారు. ఆ సమయంలో వారికి సాయం చేసేందుకు కూడా అటుగా ఎవరూ రాలేదు. దీంతో బురదలో చిక్కుకుపోయి గుంతలోనే ప్రాణాలు విడిచారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. కొంత కాలంగా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. అయితే, జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం కూడా ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.