యాప్నగరం

వైసీపీలోకి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. జగన్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు

17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎం వైఎస్ జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పారు.

Samayam Telugu 26 Jan 2020, 5:29 pm
తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు 17 మంది సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలానే ఉందని వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (జనవరి 26) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రజాప్రతినిధులను తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. రూ. కోట్లు పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం సీఎం జగన్‌కు లేదని తెలిపారు.
Samayam Telugu sajjala


మండలి రద్దుపై సలహాలు
సీఎం జగన్‌ నవతరం నాయకుడైతే.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని సజ్జల వ్యాఖ్యానించారు. శాసన మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగిందని, దీనిపై కీలక నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని సమయమిచ్చినట్లు చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. అయితే మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందని ఆరోపించారు.

మండలి చైర్మన్‌ను ప్రభావితం చేసి చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను నియంత్రించడం దుర్మార్గమన్నారు. ప్రజల సంపూర్ణ మద్దతు, తీర్పు తమవైపే ఉందన్నారు. అయినా, సీఎం జగన్‌ పద్ధతి ప్రకారమే ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.