యాప్నగరం

ఈ ఉద్యోగులకు 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు వర్తించదు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Ap Corporation Employees కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ వయసుపై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు వారికి వర్తించదని.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది ధర్మాసనం. గతేడాది సెప్టెంబర్‌లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ధర్మాసనం ముందు సవాల్ చేసింది. ఇరు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పును వెల్లడించింది. కార్పొరేషన్ల ఉద్యోగులు అర్హులు కాదని తేల్చి చెప్పింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 May 2023, 1:37 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు
  • 62కు అర్హులు కారని ధర్మాసనం కీలక తీర్పు
  • సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన ధర్మాసనం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ap Govt Corporation Employees
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం సరికాదంది ధర్మాసనం. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఏపీఈడబ్ల్యూఐడీసీతో పాటుగా మరికొన్ని కార్పొరేషన్లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు.. తమ పదవీ విరమణ వయసును 62 ఏళ్ల వరకు పొడిగించేలా ఆదేశించాలని గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పిటిషనర్లు 62 ఏళ్ల పదవీ విరమణ వయసు పొందేందుకు అర్హులని గతేడాది సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చారు.
గతేడాది డిసెంబర్‌లో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ ధర్మాసనం ముందు అప్పీల్ చేయగా.. విచారణ జరిగింది. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కొన్ని కార్పొరేషన్లు తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని తెలిపారు. కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే విధులను నిర్వహిస్తారని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. అందువల్ల వారికి 62 ఏళ్లు వర్తిస్తుందన్నారు.

కార్పొరేషన్ల ఉద్యోగులు 62 ఏళ్ల విషయంలో ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదని జస్టిస్‌ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్‌ వి. శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగులకు కార్పొరేషన్లే వారికి జీతాలు చెల్లిస్తాయని గుర్తు చేసింది. 62 ఏళ్ల వరకు పదవీ విరమణ వయసు కల్పించాలని పిటిషనర్లు కోరలేరని వ్యాఖ్యానించింది. కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల సర్వీసు నిబంధనలు.. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని కోర్టు గుర్తు చేసింది.
ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ యాక్ట్‌-1984 పబ్లిక్‌ సర్వీస్‌ కింద నియమితులై, ప్రభుత్వ వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉన్న ఉద్యోగులు.. అలాగే కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి జీతాలు తీసుకునేవారికి మాత్రమే వర్తిసుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ రాజ్యాంగంలోని అధికరణ 309 కింద రూపొందించలేదన్నారు. ఏపీ హైకోర్టు తీర్పుపై కార్పొరేషన్ల ఉద్యోగులు స్పందించాల్సి ఉంది.. వారు హైకోర్టు ధర్మాసనం తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా .. లేదా అన్నది చూడాలి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.