యాప్నగరం

రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలు.. కోట్లకు పడగలెత్తిన కాకినాడ పోర్ట్ ఏఎస్సై!

ACB Raidsలో ఇద్దరు అవినీతి తిమింగళాలు చిక్కాయి. వీరిలో ఒకరు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ ఏఎస్సై గుణ్ణం వీరవేంకట సత్యనారాయణ చౌదరి కాగా, విజయవాడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మురళీ గౌడ్.

Samayam Telugu 7 Nov 2019, 8:18 am
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఏపీతోపాటు హైదరాబాద్, బెంగళూరులో నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా ఆస్తులు భయపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్టు పోలీస్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గుణ్ణం వీరవెంకట సత్యనారాయణచౌదరి, ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాకినాడ, సామర్లకోట, యానాం, గండేపల్లి, అరట్లకట్టలో ఏఎస్పీ బృందం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా లభ్యమైన ఆస్తుల విలువ రూ.3 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినా మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 నుంచి 20 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు.
Samayam Telugu asi_2


ఏఎస్సై నివాసంలో 1.5 కేజీల బంగారు, వెండి ఆభరణాలు, రూ.3 లక్షల నగదు, 100కుపైగా ప్రామిసరీ నోట్లు, కాకినాడలో ఎనిమిది ఖాళీ స్థలాలు, 50 సెంట్ల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, కాకినాడ, సామర్లకోటలో రెండేసి ఇళ్లు, కరప మండలం, అరట్లకట్టలో ఇల్లు, చర్చి, యానాంలో మరో భవనం ఉన్నట్టు సోదాల్లో గుర్తించారు. ఏఎస్సై సత్యనారాయణచౌదరిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను రిమాండుకు తరలించారు.

ఏఎస్సై సత్యన్నారాయణ చౌదరి కాకినాడ క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి పవర గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలు, అధిక వడ్డీల బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. సత్యనారాయణచౌదరి 1984, జులై 16న ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి, 2013లో ఏఎస్సైగా ప్రమోషన్ పొందాడు. 35 ఏళ్ల ఆయన సర్వీసులో ఎక్కువ కాలం కాకినాడలోనే విధులు నిర్వహించారు.

ఇక, విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాలసాని మురళీగౌడ్‌ నివాసంలోనూ నెల్లూరు డీఎస్పీ దేవానంద్‌శాం నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. విజయవాడ పటమట పోస్టల్‌ కాలనీలోని శ్రీ రామప్రసూన అపార్టుమెంట్‌లో మురళీ గౌడ్ నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు, విజయవాడలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

ఆయన ఆస్తుల విలువ రూ.1,38,75,000 గా ఉంటుందని.. డీఎస్పీ దేవానంద్‌ తెలిపారు. తిరుపతిలోని టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ శారద, బిల్ కలెక్టర్ శ్రీనివాస్ నివాసాల నుంచి మురళీగౌడ్‌కు చెందిన రూ.13లక్షలు, రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సీఐ విజయశేఖర్‌ మీడియాకు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.