యాప్నగరం

అమరావతిలో ఉద్రిక్తతలు.. భారీగా పోలీసుల మోహరింపు

ఆందోళనల్ని ఉధృతం చేస్తున్న రైతులు. అర్థనగ్న ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు.. నిరసనలతో హోరెత్తుతున్న అమరావతి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ రైతులకు మద్దతుగా ఆందోళనలు.

Samayam Telugu 24 Dec 2019, 10:59 am
అమరావతిలో మూడు రాజధానుల ప్రకటనపై రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు ఈ ఆందోళనల్ని మరింత ఉధృతం చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలు చేస్తుండగా.. వీరికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. మందడంలో రైతుల అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మందడం రోడ్డుపై అడ్డంగా టెంట్‌ వేయడంతో సచివాలయానికి రాకపోకలు నిలిచాయి.
Samayam Telugu capital.


ఇటు మంగళగిరి మండలం నిడమర్రులో రైతుల ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్నారు. ఇటు కృష్ణాయపాలెం, వెలగపూడి, మందడంలో రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు తుళ్లూరులో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రైతులు నిరసన తెలిపేందుకు టెంటు వేసే ప్రయత్నం చేశారు. టెంట్ వేస్తుండగా రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

అమరావతి ప్రాంతం మాత్రమే కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నిరసనలు జరుగుతున్నాయి. లాయర్లు చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. ఇటు సచివాలయానికి వెళ్లే మార్గంలో రైతులు బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం వైపు వెళ్లేవారి ఐడీ కార్డును పరిశీలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, వివరాలు నమోదు చేస్తున్నారు.

అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు, ధర్నాలతో హోరెత్తడంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో బలగాలను మోహరించారు. రైతులు ఆందోళనలు చేపట్టే ప్రాంతంలో పోలీసులతో నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటు రాజధాని రైతులు బీజేపీ అధ్యక్షుడు కన్నాను కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యలను కూడా కలవనున్నారు. అలాగే మంగళవారం రాత్రి మంగళగిరిలో కాగ‌డాల‌తో నిర‌స‌న ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ ర్యాలీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా పాల్గొనున్నారు. రైతులకు తన సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.