యాప్నగరం

బొత్స వ్యాఖ్యలకు నిరసనగా.. అమరావతిలో రైతులు, వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా

Botsa Satyanarayana అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై జగన్‌ వెంటనే స్పందించాలని, బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొనడం గమనార్హం.

Samayam Telugu 25 Aug 2019, 7:51 pm
రాజధాని మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో రాజధాని గ్రామాల్లోని రైతులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాలో అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, రైతులే పాల్గొనడం గమనార్హం. రాజధానిగా అమరావతి పనికి రాదని, వరదొస్తే ఈ ప్రాంతమంతా మునిగిపోతుందంటూ బొత్స చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొత్స తీరును వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన రైతులు, నాయకులే తీవ్ర విమర్శలు గుప్పిన్నారు.

రాజధానిలోని వెలగపూడిలో భారీ ఎత్తున రైతులంతా ధర్నా చేపట్టారు. సచివాలయానికి వెళ్లే దారిలో రైతన్నలు బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తామంతా కావాలని వైఎస్ఆర్సీపీ ఓట్లేసి గెలిపిస్తే.. ఇప్పుడు అదే పార్టీ తమకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు.

రాజధాని వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుని భావించామని.. అందుకే మూడు పంటలు పండే భూములను ఇచ్చామని రైతులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ భూములు వరదలో మునిగిపోతాయని, తమను కించపర్చేలా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని నిర్మాణం కూడా మొదలై రోడ్లు వేసి, భవనాలు నిర్మించారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక ఇలా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. రాజధానిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బొత్సను వెంటనే మంత్రిగా తప్పించాలని కోరుతున్నారు.

రైతుల ధర్నాతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. అందులోనూ ధర్నా చేస్తున్నవాళ్లంతా వైఎస్ఆర్సీపీకి చెందిన వారు కావడంతో పోలీసులు కూడా ఏమీ అనలేకపోతున్నారు. రాజధానిపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వకపోతే రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇదే విధంగా ధర్నాలు, ఉద్యమాలు చేయాలని రైతులు పిలుపునిచ్చారు.

Read Also: ఏపీకి 4 రాజధానులు.. టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.