యాప్నగరం

‘ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు.. తిరుపతిలోనూ దుబ్బాక ఫలితమే’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కళ్లకు మాస్క్ వేసుకున్నారని, రాష్ట్రంలో అక్రమాలను అందుకే చూడలేకపోతున్నారని దుయ్యబట్టారు.

Samayam Telugu 13 Nov 2020, 6:43 am
గురువారం తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్, లాండ్, ఇసుక మాఫియా చేలరేగిపోతున్నాయని మండిపడ్డారు. ఆలయాలు, ట్రస్టుల భూములు ఏమైపోతున్నాయని, జగన్ వీటిని చూడలేని స్థితిలో ఉన్నారని ఆరోపించారు. ఆయన కళ్లకు కూడా మాస్క్‌ వేసుకున్నారని, అందుకే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చూడలేకపోతున్నారని దేవ్‌ధర్ ఎద్దేవా చేశారు.
Samayam Telugu జగన్-కేసీఆర్
Andhra Pradesh CM Jaganmohan Reddy interacts with Telangana CM K. Chandrashekhar Rao. (File photo)


‘ఒక విజ్ఞప్తి చేస్తున్నా... అందరూ ముక్కు వరకే మాస్కులు పెట్టుకోండి.. కళ్లకు మాస్కులు వేసుకోవద్దు... ఎందుకంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి కళ్లకు కూడా మాస్కులు వేసుకున్నారు.. అందుకే రాష్ట్రంలో మాఫియాలు చెలరేగిపోతుంటే ఆయన చూడలేకపోతున్నారు’ అని దుయ్యబట్టారు. కరోనాపై ముందుండి పోరాటం చేస్తున్నవారికి జీతాలు ఇవ్వరుగానీ... పాస్టర్లకు, ఇమాంలకు జీతాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాన్ని పునరావృతం చేస్తామని సునీల్‌ దేవధర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందని, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అధిక వడ్డీ పేరుతో టీటీడీ డిపాజిట్లను బ్యాంకుల్లో నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లోకి మళ్లించే ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎస్వీబీసీలో అశ్లీల చిత్రాలు, వీడియోల వ్యవహారం బయటకు రావడం వైఎస్‌ఆర్‌సీపీ పాలనకు నిదర్శనమని, ధర్మాచారుల ద్వారా ఛానల్‌ నడపాలని డిమాండు చేశారు.

రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ ఉండాలా? వద్దా? అన్నది ఆలోచిస్తామని పేర్కొన్నారు. పోలవరానికి ఇప్పటికే కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చినా పనులు ముందుకు సాగడం లేదని, ఈ ప్రాజెక్టును బీజేపీ నిర్మిస్తుందని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఇసుక దోపిడీ, ఎర్రచందనం అక్రమ రవాణాలో సిద్ధహస్తుడని వీర్రాజు ఆరోపించారు. బీజేపీ, జనసేన రాష్ట్రంలో అవినీతిని, కుటుంబపాలనను పెకలిసిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.