యాప్నగరం

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... విద్యుత్ బిల్లులు అంత చెల్లిస్తే చాలు

ఏపీసీపీడీసీఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో ఎంత బిల్లు చెల్లించారో అదే మొత్తాన్ని మార్చి నెలకు. ఒకవేళ విద్యుత్‌ వినియోగంలో హెచ్చు తగ్గులుంటే వచ్చే నెలలో ఆ మేరకు సర్దుబాటు

Samayam Telugu 2 Apr 2020, 12:30 pm
ఏపీ ప్రజలకు అక్కడ విద్యుత్ శాఖ శుభవార్త తెలిపింది. విద్యుత్‌ వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్కం పరిధిలోని వినియోగదారులు ఫిబ్రవరి నెలలో ఎంత బిల్లు చెల్లించారో అదే మొత్తాన్ని మార్చి నెలకూ చెల్లిస్తే సరిపోతుందని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మ జనార్దనరెడ్డి మీడియాకు తెలిపారు. ఒకవేళ విద్యుత్‌ వినియోగంలో హెచ్చు తగ్గులుంటే వచ్చే నెలలో ఆ మేరకు సర్దుబాటు చేస్తామని వివరించారు.
Samayam Telugu power bill


కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్‌తో అంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా 24 గంటల్లో కరెంట్ అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనే ఉండేవాళ్లు.. సినిమాలు చూస్తే కాలక్షేపం చేస్తున్నారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలుంటే 1912 నెంబరు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిలోనే ఉంటూ సహకరిస్తున్న విద్యుత్‌ వినియోగదారులకు, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు సహకరిస్తున్న ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వరకు ఇదే సహకారాన్ని అందించాలని, ప్రజలందరికి ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై సురక్షితంగా ఉండాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.