యాప్నగరం

సులభతర వాణిజ్యంలో ఏపీ నంబర్‌ 1.. తెలంగాణను వెనక్కునెట్టిన యూపీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, తెలంగాణ మూడో స్థానానికి పడిపోయింది.

Samayam Telugu 5 Sep 2020, 5:12 pm
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో మరోసారి ఏపీ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. అనూహ్యంగా గతంలో 12వ స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తెలంగాణను వెనక్కు నెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
Samayam Telugu ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్ 1
Andhra Pradesh Tops In Ease Of Doing Business


గతంలో 12 స్థానంలో ఉన్న యూపీ ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఇక నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో జార్ఖండ్‌, ఆరో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఈసారి పదో స్థానంలో నిలిచింది. అలాగే లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ను అమలు చేయడంలోనూ అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది.

ఈ సందర్భంగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్‌ అభినందనలు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయని ఆమె అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.