యాప్నగరం

NRC, NPR ఏపీలో చేపట్టేది లేదు.. అసెంబ్లీలో కీలక తీర్మానాలు..

ఏపీలో ఎన్నార్సీ, ఎన్‌పీఆర్ చేపట్టేది లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టారు.

Samayam Telugu 17 Jun 2020, 5:02 pm
ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ 2020-21కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ను అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధించి రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మూజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదం తెలిపారు.
Samayam Telugu సీఎం జగన్


అంతకముందు భారత్‌- చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన వీరసైనికులకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బుధవారం సంతాపం తెలిపింది. భారత జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సంతాప తీర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

‘దేశసమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ, ఇండియా – చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయ వద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మన దేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరఫున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తోంది. మొత్తం దేశంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. తెలుగువాడు, పక్కరాష్ట్రం తెలంగాణలోని సూర్యాపేట వాసి కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.