యాప్నగరం

Amaravati: కేంద్రానికేం సంబంధం..! ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఒకాయన మూడు రాజధానులంటారు.. మరొకాయన పది.. పదిహేనంటారు.. సొంత అజెండా కోసం సీఎం జగన్‌.. కులాలు, మతాలు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ బీజేపీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 21 Dec 2019, 6:51 pm
ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో ప్రకటన చేసినప్పుడు సానుకూలంగా స్పందించిన కన్నా.. తన రూటు మార్చారు. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని.. కానీ పరిపాలన వికేంద్రీకరణ సరికాదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారంపై బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న వేళ.. తమ వైఖరిని కన్నా కుండబద్దలు కొట్టారు.
Samayam Telugu kanna-laxminarayana


రాజు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? కన్నా జగన్ సర్కార్‌ని సూటిగా ప్రశ్నించారు. అలాంటి విధానాలు ఒక్క జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నామంటూ ధ్వజమెత్తారు. రాజధాని మార్చడం మంచిది కాదన్న కన్నా.. రాష్టాభివృద్ధికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత అజెండా కోసం సీఎం జగన్‌.. కులాలు, మతాలు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆరు నెలల్లో రాష్ట్రాభివృద్ధికి జగన్‌ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: పాలన అంతా అక్కడి నుంచే.. మరో బాంబు పేల్చిన విజయసాయి

ఒకరు మూడు రాజధానులంటారు.. మరొకాయన పది.. పదిహేనంటారు.. ఇష్టమొచ్చినట్లు రాజధానిని మార్చే హక్కు ఎవరిచ్చారని కన్నా నిలదీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దంటూ హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ చీఫ్ కన్నా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు ముఖ్యమంత్రిదే బాధ్యతని వ్యాఖ్యానించారు.

జగన్ అభద్రతాభావంతో ఉన్నారని.. 150 సీట్లు ఉండి కూడా ఎందుకు భయపడుతున్నాడో అర్థంకావడంలేదన్నారు కన్నా. గత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న కక్షతో రాజధాని ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే చర్యలు తీసుకోకుండా ఆర్నెళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని.. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి ఓ కలేనంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Also Read:అప్పుడు ల్యాండ్ పూలింగ్‌.. ఇప్పుడు 3 రాజధానులట.! రాజధాని మహిళ ఆవేదన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.