యాప్నగరం

Tirupati అభివృద్ధి చేసింది మోదీనే: ఉప ఎన్నికపై సోము వీర్రాజు ట్విస్ట్.. జనసేన పొత్తుపై తేల్చేశారు!

Tirupati By Poll: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 25 Nov 2020, 4:04 pm
ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతి అభివృద్ధికి ప్రధాన కారణం నరేంద్ర మోదీయేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తిరుపతి ఉప ఎన్నిక హీట్ మొదలైన తరుణంలో సోము వీర్రాజు నగరంలో కార్యకలాపాలను ముమ్మరం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు పవన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ తరుణంలోనే బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తిరుపతిలో తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో జనసేన, బీజేపీ పొత్తుపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చజరిగింది.
Samayam Telugu ప్రధాని మోదీతో సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)


ఈ తరుణంలో సోము వీర్రాజు జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జనసేనతో కలిసే బీజేపీ పనిచేస్తుందని తేల్చి చెప్పారు. బీజేపీ, జనసేన నుంచి ఎవరు బరిలో దిగినా.. రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని ఆయన వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నిక విషయంపై ఢిల్లీలో పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

అలాగే చంద్రబాబు నాయుడిపై సైతం సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎన్నారై మాదిరిగా తయారయ్యారని, పక్క రాష్ట్రంలో ఉంటూ.. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతారని విమర్శించారు. ఇక్కడి ప్రజల బాగోగులు మాత్రం చంద్రబాబుకు పట్టవని విమర్శించారు. ఆయన తీరు మారడం లేదని.. ప్రజలు కూడా తగిన సమయంలో బుద్ది చెబుతారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.