యాప్నగరం

కేసీఆర్ మోసం, సీఎం జగన్‌కు పార్టీలన్నీ మద్దతివ్వాలి.. బీజేపీ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నదీ జలాల విషయంలో రాయలసీమపై కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఏపీ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు.

Samayam Telugu 12 May 2020, 6:02 pm
Samayam Telugu కేసీఆర్, జగన్
సముద్రంలో కలిసిపోయె నీటిని రాజలసీమ ప్రజలు వాడుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డుకోవడం ఆయన రాజకీయ దిగజారుడుకు నిదర్శనమని బీజేపీ ఏపీ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కదిరిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగు నీరు, తాగునీరు లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి స్పష్టంగా బయటపడిందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సందేనని విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారని విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. రాయసీమకు అన్యాయం చేయాలని చూస్తున్న కేసీఆర్ విధానాలను తెలంగాణ ప్రజలు సైతం గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ (అనంతపురం జిల్లా ఇన్‌చార్జిగా)కు రాయలసీమలో కరువు పరిస్థితుల గురించి తెలియదా అని అని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాక, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.