యాప్నగరం

డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బీజేపీ సీరియస్ వార్నింగ్.. ఆ మాటలకు క్లారిటీ ఇవ్వలేదో..!

డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆలయాల మీద దాడులపై..

Samayam Telugu 16 Jan 2021, 11:22 pm
ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతోంది. మత రాజకీయాలపై ఇప్పటి వరకు రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడవగా.. తాజాగా, రాష్ట్ర డీజీపీ Vs బీజేపీ, టీడీపీగా పరిస్థితి మారింది. ఆలయాలపై జరిగిన దాడులు, ప్రచారం వెనుక టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తముందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించడం తీవ్ర దుమారం రేపుతోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ పక్కా రాజకీయ నాయకుడి మాదిరిగా మాట్లాడుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బీజేపీ వార్నింగ్


తాజాగా, డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు గౌతమ్ సవాంగ్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖ రాశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కేసులో తమ పార్టీ బీజేపీ కార్యకర్తల హస్తమన్నట్లు ప్రకటించారని.. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలని కోరారు. మీరు చేసిన ప్రకటన వల్ల మీడియాలో ఆలయాలపై జరిగిన దాడుల వెనుక బీజేపీ కార్యకర్తల హసం ఉన్నట్లు వార్తలు ప్రచురితమవుతున్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు.

ఆలయాల ధ్వంసం వివాదంతో బీజేపీ కార్యకర్తలకు సంబంధం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అలాగే విగ్రహాలపై దాడులు చేయడానికి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి చాలా తేడా ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారనడం అర్థరహితమన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. ఆలయాలకు రక్షణ కల్పించకుండా కావాలనే తమ పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చేలా ప్రకటనలివ్వడం సరికాదన్నారు. అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడటం, మరికొన్ని పార్టీలపై నేరుగా విమర్శలు చేయడం తగదని సూచించారు. మీరు చేసిన అస్పష్టమైన ప్రకటన వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాని సోము వీర్రాజు పేర్కొన్నారు.

బీజేపీ కార్యకర్తల మీద చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఒకవేళ దీనిపై తగు రీతిలో స్పందించకపోతే క్రిమినల్ లా ప్రకారం చర్యలు తీసుకుంటామని, అలాగే పరువు నష్టం దావా వేస్తామని లేఖలో హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.