యాప్నగరం

ఏపీ బడ్జెట్‌లో రాజధానికి కేటాయింపులు ఇవే!

ఏపీలో రాజధాని మార్పు అంశం వివాదాస్పదం అవుతున్న వేళ.. మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లను రాజధాని కోసం కేటాయించింది.

Samayam Telugu 16 Jun 2020, 3:29 pm
ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గత ఏడాదిలాగే ఈ దఫా కూడా బడ్జెట్లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది బడ్జెట్లో అమరావతి కోసం రూ.500 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో నూతన రాజధానికి అవసరమైన మౌలిక వసతుల కోసం రూ.500 కోట్లు, రాష్ట్రంలో స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం రూ.300 కోట్లు కేటాయించారు.
Samayam Telugu సీఎం జగన్, బుగ్గన
ap budget 2020 buggana rajendranath reddy


జగన్ సర్కారు మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో పట్టుదలతో ఉన్నందువల్లే రాజధానులకు భారీగా నిధులు కేటాయించలేదని భావించొచ్చు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర పడగా.. శాసన మండలిలో పెండింగ్‌లో ఉంది. మూడు రాజధానుల బిల్లు కారణంగా శాసన మండలి రద్దుకు ప్రతిపాదిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది.

గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోందని గవర్నర్ తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా లక్ష్యమని ఆయన చెప్పారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు రాలేదు.

విశాఖపట్నంలో 140.11 కి.మీ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు విషయాన్ని బుగ్గన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. భోగాపురం నుంచి అనకాపల్లి వరకు మరింత రవాణా మార్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 79.91 కి.మీ. లైట్ మెట్రో రైల్.. మిగతా 60.20 కి.మీ. మేర క్యాటినరీ ప్రీ మోడ్రన్ ట్రామ్ మెట్రోలైట్ సిస్టమ్ కోసం ఉపయోగిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.