యాప్నగరం

అమరావతి రైతులపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ నేత వ్యాఖ్యలు.. జగన్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు గత 24 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Samayam Telugu 12 Jan 2020, 8:10 am
అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమంపై వైఎస్‌ఆర్సీపీ నేత, ఎస్వీబీసీ ఛైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రైతులు ముసుగులో పెయిడ్ ఆర్టిస్ట్‌లు ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించడమే కాదు, కులం పేరును కూడా ఆపాదించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ వ్యాఖ్యలపై సీఎం జగన్‌మోహన్ రెడ్డి కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాజధాని రైతులను ఉద్దేశించి పృథ్వీరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై మాట్లాడాలే తప్ప.. కులాల ప్రస్తావన సరికాదని ఆయన హితవు పలికినట్టు సమాచారం.
Samayam Telugu pjimage (35)


రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోందని వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కులాలను ప్రస్తావిస్తూ.. ఎవరినీ కించపరిచేలా వ్యాఖ్యలు చేయరాదని జగన్ ఆదేశించినట్లు తెలిపాయి. గతవారం ఒంగోలులో పర్యటించిన ఎస్వీబీసీ ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజధానుల వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, పలువురు నిపుణుల కమిటీల నివేదికల ఆధారంగా తీసుకున్న నిర్ణయం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా అమరావతిలో రైతుల ఉద్యమంపై విమర్శలు గుప్పించారు. అమరావతిలో ప్రస్తుతం పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతోందని పృథ్వీరాజ్‌ ఆరోపించారు. అంతేకాదు, వారు సాధారణ రైతులై అయితే ఆడి కార్లు,మహిళల చేతులకు బంగారు గాజులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పేరుకే అది రైతుల ఉద్యమం, కానీ అక్కడ నడుస్తున్నది కార్పొరేట్ మాయాజాలం అని ధ్వజమెత్తారు. రైతుల ముసుగులో సాగుతున్న కార్పొరేట్ ఉద్యమాన్ని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై నటుడు, వైఎస్‌ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి సైతం విమర్శలు గుప్పించారు. రైతులైతే కార్లలో తిరగవద్దా, మహిళలకు బంగారు గాజులు ఉండొద్దా అని మండిపడ్డారు. కులాల ప్రస్తావన తేవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.