యాప్నగరం

ఆ ప్రాజెక్టు మీరే చేపట్టండి.. అమిత్ షాకు సీఎం జగన్ విజ్ఞప్తి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక హోదా ఉండాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాలకు కూడా బుందేల్‌ఖండ్‌, కలహండి తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

Samayam Telugu 22 Oct 2019, 5:39 pm
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, ఆదాయంలో వీటి వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని అమిత్‌షాకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా ఉండాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu Amit-Shah


గతంలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలని అమిత్‌ షాను కోరారు. సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటుకు సంబంధించి కేంద్రం కొంత నిధులు చెల్లించాల్సి ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిధులు తక్షణమే విడుదలయ్యేలా చూడాలని కోరారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాలని కోరారు.

Also Read: గుంటూరులో ఘోరం.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం..
వెనకబడ్డ జిల్లాలకు నిధుల కేటాయింపు విధానాన్ని మార్చాలని సీఎం జగన్ కోరారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాలకు తలసరి రూ.400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4,000 ఇస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కూడా అదే తరహా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇప్పటివరకూ రూ.2,100 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ రూ.1,050 కోట్లుమాత్రమే ఇచ్చారని, మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్ విన్నవించారు.

పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై అమిత్ షా, సీఎం జగన్ చర్చించారు. ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ.838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు అమిత్‌షాకు వివరించారు.

Read Also: లేటుగా వచ్చిన తిరుమల ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు స్నేహితులను పొట్టనబెట్టుకుంది..అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని సమావేశంలో సీఎం ప్రస్తావించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోతోందన్నారు. మరోవైపు గోదావరి జలాలు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని, మూడు దశాబ్దాల్లో సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాల్సిందిగా అమిత్ షాను కోరారు. గోదావరి జలాల తరలింపుతో రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.