యాప్నగరం

మొన్న చెన్నై.. నిన్న హైదరాబాద్! జగన్ భావోద్వేగం

దగా పడిన రాష్ట్రం మనది. దేశంలో వేరే ఏ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి రాలేదు. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కలసికట్టుగా ముందుకు సాగాలి. కష్టాలు తొలగాక అంతా మంచే జరుగుతుందంటూ ఏపీ సీఎం జగన్ భావోద్వేగ ప్రసంగం చేశారు.

Samayam Telugu 1 Nov 2019, 9:07 pm
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను గవర్నర్, సీఎం ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుల వారసులను సన్మానించారు.
Samayam Telugu jagan


అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్షకు దిగారని.. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. దేశం, రాష్ట్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ అవతరణ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. సంఘ సంస్కర్తలు, కవులు, కళాకారుల సేవలను కొనియాడారు. రాష్ట్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలన్నారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Also Read: మహనీయుల వారసులకు సీఎం జగన్ సత్కారం.. అవతరణ దినోత్సవం హైలైట్స్

వైఎస్సార్ ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎవ్వరూ ఊహించలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల శ్రమ, పరిశ్రమ అప్పుడు చెన్నై, ఇప్పుడు హైదరాబాద్‌లోనే మిగిలిపోయిందని జగన్ చేసిన వ్యాఖ్యలు ఆహుతులను భావోద్వేగానికి గురిచేశాయి. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత అవతరణ వేడుకలు జరుపుకుంటున్నామని.. తెలుగు తల్లికి, తెలుగు నేలకు, తెలుగువారికి వందనాలు తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రం పడనంత దగా పడ్డామని, అలాంటి పరిస్థితులను అధిగమించాలని సీఎం జగన్ అన్నారు. వెనకడగు వేయకుండా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామన్నారు. ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కలిసి ముందుకు సాగి అన్నింటినీ అధిగమించి అభివృద్ధిని సాధిద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వెనుకబాటుతనం, నిరక్షరాస్యత నిర్మూలించేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని జగన్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసి రావాలని కోరారు.

ఏపీకి గవర్నర్‌గా ఉండటం గర్వకారణం.. గవర్నర్ హరిచందన్
చివరిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ గొప్ప చారిత్రక నేపథ్యం, సంస్కృతి ఉన్న రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం గర్వంగా ఉందన్నారు. శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు పాలించిన పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్‌ అని ప్రశంసించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఈ ప్రాంతం నుంచి ఎందరో మహానుభావులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజును స్మరించుకున్నారు. గాంధీ మహాత్ముడు నడయాడిన నేల విజయవాడ అని గవర్నర్‌ గుర్తు చేశారు. జాతీయ జెండా రూపకర్తను పింగళి జన్మభూమి అంటూ కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.