యాప్నగరం

ఏపీలో వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ.. మరో ఆరు జిల్లాలకు విస్తరణ

మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో అమలులోకి రానుంది.

Samayam Telugu 16 Jul 2020, 12:32 pm
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తోంది జగన్ సర్కార్. పేదవాడికి ముఖ్యమైన వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎన్నో మార్పులు చేసిన ప్రభుత్వం.. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే పథకం వర్తింప చేస్తోంది. ఈ పథకాన్ని మరో ఆరు జిల్లాల్లో అమలు చేసింది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో అమలులోకి రానుంది.
Samayam Telugu సీఎం జగన్


కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి పెద్ద పీట వేశామన్నారు ముఖ్యమంత్రి జగన్. వైద్యం కోసం పేదలు ఎవరూ ఇబ్బందిపడకూడదనే.. ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తున్నామన్నారు. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తున్నామని.. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమచారాన్ని సర్వర్‌లో భద్రపరుస్తున్నామన్నారు. ఆస్పత్రులకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తామని.. నెట్ వర్కింగ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. గ్రామాల్లో 13వేల క్లినిక్‌లు ప్రారంభిస్తామన్నారు జగన్. ఏప్రిల్ నాటికి గ్రామ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయి అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతున్నామని.. ఆరోగ్య శ్రీ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగదన్నారు జగన్. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే.. ఆరోగ్య శ్రీ వర్తిస్తుందన్నారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూదన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు చేశారు. ఈ ఏడాది జనవరిలో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 జబ్బులకే చికిత్స అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి (మొత్తం 2200) వ్యాధులను చేర్చింది. పైలట్‌ ప్రాజెక్టు అమలు సమయంలో గుర్తించిన అంశాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేశారు.. విధివిధానాలు రూపొందించారు. రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా నవంబర్‌ 14నాటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.