యాప్నగరం

ముగిసిన జగన్ ఢిల్లీ టూర్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌తో కీలక భేటీ

పోలవరం ప్రాజెక్ట్ సవరించిన వ్యయంను ఆమోదించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాల్సిందిగా కోరారు.

Samayam Telugu 16 Dec 2020, 10:54 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. మంగళవారం కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన జగన్.. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం అంశంపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నవించారు.. ప్రాజెక్ట్‌ను సత్వరం పూర్తి చేయడానికి తగిన సాయం చేయాలని మంత్రిని సీఎం కోరారు.
Samayam Telugu గజేంద్ర సింగ్‌తో జగన్ భేటీ (File Photo)


పోలవరం సవరించిన వ్యయంను ఆమోదించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాల్సిందిగా కోరారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య పెరిగిందని.. 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందన్నారు. ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా పెరిగిందని.. ఆర్‌ అండ్‌ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగింది అన్నారు.

పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1779 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉందని జగన్‌ భేటీలో ప్రస్తావించారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈబిల్లులు పెండింగులో ఉన్నాయని.. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా పెరిగిపోతుందన్నారు. జగన్‌ అభ్యర్థనలపై షెకావత్‌ సానుకూలంగా స్పందించారు.. అలానే నదుల అనుసంధానంపై ఏపీతో చర్చించాలని.. జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను షెకావత్‌ ఆదేశించారు. గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఏపీకి రావాలని శ్రీరామ్‌ను సీఎం జగన్‌ ఆహ్వానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.