యాప్నగరం

బుగ్గన రాజేంద్రనాథ్‌కు ప్రమోషన్ ఇచ్చిన సీఎం జగన్.. మంత్రివర్గ విస్తరణకు ముందు అనూహ్య నిర్ణయం

త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇంతలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు శాఖలు కేటాయించారు.

Samayam Telugu 14 Mar 2022, 6:11 pm
మంత్రివర్గాన్ని త్వరలోనే పునర్వ్యవస్థీకరిస్తానని ఇటీవలే ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పదవి నుంచి తప్పించి.. మరో సీనియర్ నాయకుడికి ఈ కీలక పదవి కట్టబెడతారని ఇటీవల జోరుగా వార్తలు వెలువడుతున్న తరుణంలో.. బుగ్గనపై తనకు ఉన్న నమ్మకాన్ని సీఎం జగన్ మరోసారి చాటారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు మరిన్ని శాఖలను అప్పగించారు.
Samayam Telugu సీఎం జగన్‌తో బుగ్గన రాజేంద్రనాథ్


రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి శాఖలన్నింటినీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్‌ ఇచ్చారు.

ఇప్పటికే ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలను బుగ్గన రాజేంద్రనాథ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు అదనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలను కూడా బుగ్గనకు అప్పగిస్తూ గవర్నర్‌‌కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్ కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. మంత్రి బుగ్గనకు సీఎం జగన్ ప్రమోషన్ ఇచ్చిన క్రమంలో.. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బుగ్గన రాజేంద్రనాథ్ కొనసాగడం ఖాయమని పలువురు విశ్లేషిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.