యాప్నగరం

MPTC, ZPTC ఎన్నికల్లో వైసీపీ రీసౌండ్ విక్టరీ.. సీఎం జగన్ ఎమోషనల్ కామెంట్స్!

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 20 Sep 2021, 3:23 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. గత రికార్డులన్నీ చెరిపివేస్తూ రీసౌండ్ విక్టరీ సాధించింది. ఎన్నికలకు ముందే ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ బహిష్కరణ పేరుతో చేతులు ఎత్తేయడంతో.. వైసీపీ విజయం నల్లేరు మీద నడకలాగే సాగింది. ఈ క్రమంలో వైసీపీ అఖండ విజయంపై ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu వైఎస్ జగన్


రాష్ట్ర ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం జగన్‌ సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఓ వీడియో బైట్ విడుదల చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింతగా పెంచాయని తెలిపారు. పరిషత్‌ ఎన్నికల్లో ఇంతటి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.


రాష్ట్రంలోని 13,081 పంచాయతీలకు గాను.. అక్షరాలా 10,536 పంచాయతీల్లో (81 శాతం) వైసీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని సీఎం జగన్ వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 75 స్థానాలకు గాను ఏకంగా 74 చోట్ల (99 శాతం) వైసీపీ అభ్యర్థులే గెలిచారని తెలిపారు.

86 శాతం ఎంపీటీలు, 98 శాతం జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిపిచారని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని.. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని మండిపడ్డారు.

రాష్ట్రంలోని ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్ష పార్టీ గట్టిగా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. కోవిడ్‌ పేరుతో గతంలో కౌంటింగ్‌ కూడా వాయిదా వేయించారని గుర్తు చేశారు. ఇన్ని అవాంతరాల్లోనూ ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం జగన్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.