యాప్నగరం

దావోస్‌కు బయల్దేరిన జగన్.. సీఎం హోదాలో తొలిసారి!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటకు బయల్దేరారు. సీఎం హోదాలో తొలిసారి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో వర్డ్ ఎకానమిక్ ఫోరమ్ సమావేశంలో పాల్గొననున్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 20 May 2022, 8:28 am
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు. బుధవారం ఉదయం తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. శుక్రవారం రాత్రికి స్వట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకోనున్నారు. దావోస్‌లో ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.
Samayam Telugu సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


దీంతో ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా చేసే విదేశీ పర్యటన ఇదే అవుతుంది. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి.. లండన్, అమెరికా, ఇజ్రాయెల్ వెళ్లినా అవి పూర్తిగా వ్యక్తిగత పర్యటనలు అని అప్పట్లో సీఎం కార్యాలయం చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి హోదాలో జగన్ దావోస్ పర్యటకు వెళ్లారు.

మే 22 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొనున్నారు. కోవిడ్‌ లాంటి పరిస్థితుల నేపథ్యంలో.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం జగన్ దావోస్ వేదికగా వివరించనున్నారు.

కాగా, ఈ సదస్సులో పాల్గొనాలని గతంలోనే సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబర్‌లోనే జరగాల్సి ఉందగా.. కరోనా థర్డ్ వేవ్ అలజడి నేపథ్యంలో వాయిదా వేశారు. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్‌గా జరుగుతుండగా.. ఈసారి నేరుగా జరగనున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ప్రతి ఏడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్ వెళ్లేవారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం దావోస్‌లో జరిగే సమ్మిట్‌ కోసం అక్కడికి వెళ్లారు. ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.