యాప్నగరం

అంగన్వాడీ టీచర్లకు సీఎం జగన్ అదిరే శుభవార్త.. విద్యా విధానంలో సంచలన మార్పులు!

ఏపీలో నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి జన్మోహన్ రెడ్డి కీలక విషయాలు చెప్పారు. అలాగే, అంగన్వాడీ టీచర్లకు శుభవార్త చెప్పారు.

Samayam Telugu 4 Aug 2021, 7:06 pm
ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులకు కల్పిస్తామని వెల్లడించారు. ఏపీలో నూతన విద్యా విధానంపై అధికారులతో బుధవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త విధానం ప్రకారం.. పీపీ- 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 14 వేల పాఠశాలలు అదనంగా అవసరమవుతాయని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. నూతన విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం సూచించారు.
Samayam Telugu విద్యార్థులతో జగన్ పాదయాత్ర


నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడతారని సీఎం జగన్ తెలిపారు. ఈ విధానం ద్వారా ఉపాధ్యాయులకు పని భారం కూడా తగ్గుతుందన్నారు. అలాగే అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులకు కల్పిస్తామన్నారు. ఇక, పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని జగన్‌ ఆదేశించారు.

నూతన విద్యావిధానం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ
శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2)
ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2)
ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ– 1 నుంచి 5వ వరగతి వరకు)
ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8 వ తరగతి వరకు)
హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు)
హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) ఇలా 6 రకాలుగా వర్గీకరించామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌ 44 వేల నుంచి సుమారు 58 వేల స్కూల్స్‌ అవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలి
3వ తరగతి నుంచి నిపుణులైన టీచర్ల ద్వారా విద్యాబోధన జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల ప్రపంచ స్థాయి పోటీకి తగినట్లుగా విద్యార్థులు తయారవుతారని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన అందుతుందని, తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం, నాడు- నేడు కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

నూతన విద్యా విధానంపై ప్రజలందరిలో అవగాహన తీసుకురావాలని, నూతన విద్యా విధానం ఉద్దేశాలను వివరంగా తెలియజేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, పీడీలకు అవగాహన కల్పించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.