యాప్నగరం

చెలగాటమొద్దు: దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 1 Jan 2021, 5:43 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో హిందూ దేవుళ్ల విగ్రహాలను కొందరు ధ్వంసం చేస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం వంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి జగన్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడితో చెలగాటమాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. దేవుడితో పెట్టుకుంటే తప్పకుండా శిక్షిస్తాడని పేర్కొన్నారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోసారి అలాంటి సంఘటనలకు ఎవరూ పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Samayam Telugu సీఎం జగన్


కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో హిందూ దేవుళ్ల విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే విజయనగరం జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు.

ఈ ఘటన మరువక ముందే తాజాగా రాజమండ్రిలో మరో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రాజమండ్రి శ్రీరాంనగర్‌లో విఘ్నేశ్వరాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంలోని విగ్రహం రెండు చేతులను దుండగులు తొలగించారు. టీడీపీ నేత గన్ని కృష్ణ ఇంటికి సమీపంలో ఉన్న ఆలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. ఉద్దేశపూర్వకంగానే హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తరుణంలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.