యాప్నగరం

ఎమ్మెల్యేలూ.. సమరానికి సిద్ధం కండి: అలాంటోళ్లను ఉపేక్షించేది లేదు.. సీఎం జగన్ మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం రెండేళ్ల ముందే ఎన్నికల శంకారావం పూరించినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 15 Mar 2022, 7:14 pm
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ సర్కారుపై ప్రతిపక్ష తెలుగు దేశం, జనసేన పార్టీలు సమరభేరీ మోగించడంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాయువేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోమవారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తుపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చూస్తానని.. జగన్ సర్కారును దించేందుకు అవసరమైతే పొత్తులు కూడా పెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రతిపక్ష టీడీపీ సైతం పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఫుల్ జోష్‌లో ఉంది. పవన్ కళ్యాణ్ ప్రకటనను టీడీపీ నాయకులు స్వాగతించారు.
Samayam Telugu సీఎం జగన్


ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


దాదాపు రెండేళ్ల తర్వాత వైసీఎప్పీ సమావేశం ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేల పని తీరును కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని, దీని ప్రకారమే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని తేల్చి చెప్పారు. రాబోయేది పరీక్షా సమయమని స్పష్టం చేశారు. 2 సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోందని.. ప్రజలకు చేసిన మంచిని తీసుకుని వెళ్లలేకపోతే అది మన తప్పే అవుతుందని దిశానిర్దేశం చేశారు.

ఈ విషయాన్ని ఎవరూ కూడా తేలిగ్గా తీసుకోవద్దని సీఎం జగన్ తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ఎవరు సరైన పనితీరు చూపించకపోయినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పనితీరుపై చేపట్టే సర్వేల్లో పేర్లు రాకపోతే కచ్చితంగా మార్పులు వస్తాయని ఎమ్మెల్యేలకు కుండబద్ధలు కొట్టారు. అలాంటి అవకాశం ఇవ్వరని భావిస్తున్నట్లు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఎలా ఉన్నా.. ఇకపై పల్లె బాట పట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.