యాప్నగరం

పైసలు ప్రధానివి, పేరు వైఎస్ఆర్‌ది.. జగన్ పిలిస్తే మోదీ వస్తారా?

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ స్వయంగా చంద్రబాబు నాయుణ్ని స్టిక్టర్ బాబు అని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులిచ్చిన పథకాలకు పేరు మార్చి ఆ క్రెడిట్‌ను బాబు కొట్టేశారనేది మోదీ ఉద్దేశం. ఇప్పుడు జగన్ కూడా అలాంటి పనే చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 3 Oct 2019, 12:42 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీల అమలు గురించి ఆయన ప్రధానితో చర్చిస్తారు. అక్టోబర్ 15న ప్రారంభించనున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసిన మరుసటి రోజే జగన్ కూడా మోదీని కలుస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu Narendra Modi YS Jagan


వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తెలంగాణలో ఈ పథకాన్ని రైతు బంధు పేరిట అమలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు ఈ పథకాన్ని భూమి ఉన్న రైతులకు మాత్రమే పరిమితం చేయగా.. జగన్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఏటా రూ.12,500 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.

కిసాన్ సమ్మాన్ యోజనకు శ్రీకారం చుడుతున్నట్టు ఎన్నికల ముందు మోదీ సర్కారు ప్రకటించింది. దీనికి తెలంగాణ రైతు బంధు పథకమే ఆదర్శం. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో భాగంగా దేశంలోని ప్రతి రైతుకు ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందజేయనున్నారు. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని అందజేస్తారు.

కేంద్రం అందించే రూ. 6 వేలకు మరో రూ.6500 కలిపి రైతు భరోసా పేరిట జగన్ సర్కారు అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందించనుంది. దీనికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. కేంద్రం నిధులు అందిస్తున్నందున ఈ పథకానికి ప్రధాని మోదీ పేరు పెట్టాలని ఇటీవలే కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. కేంద్రం సహకారం, వైఎస్ఆర్ పేరు ఉన్న ఈ పథకం ప్రారంభోత్సవానికి జగన్ పిలిస్తే.. ప్రధాని మోదీ హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: జగన్.. ఆ పథకాని మోదీ పేరు పెట్టు: కన్నా

ఎందుకంటే.. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీనే చంద్రబాబు నాయుణ్ని స్టిక్కర్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. అంటే.. కేంద్రం నిధులిచ్చే పథకాలకు తన స్టిక్కర్ వేసుకొని రాష్ట్ర పథకాలుగా బాబు ప్రచారం చేసుకున్నారనేది మోదీ ఆరోపణ. అదే కోణంలో చూస్తే.. ఇప్పుడు జగన్ కూడా కిసాన్ సమ్మాన్ యోజనకు వైఎస్ఆర్ రైతు భరోసా అని స్టిక్కర్ వేస్తున్నట్టే కదా.

Read Also: యూటర్న్ బాబు, స్టిక్కర్ బాబు.. మోదీ వ్యంగాస్త్రాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.