యాప్నగరం

కాపు మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.15వేలు సాయం

ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తారు. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుండగా.. నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.

Samayam Telugu 24 Jun 2020, 6:28 am
సంక్షేమ పథకాలతో దూసుకెళుతోంది జగన్ సర్కార్. కరోనాతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా ప్రజల కోసం వినూత్న పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మహిళల కోసం మరో వినూత్న పథకం ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ను తీసుకొచ్చింది. నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తారు. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుండగా.. నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.
Samayam Telugu సీఎం జగన్


2019–20కి సంబంధించి ఈనెల 24వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే.. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు. ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.అదే పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.
కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు.. ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.. కానీ ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరూ పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు.

Also Read: అనంతపురం: కూరగాయలు అమ్ముతున్న టీచర్.. అయ్యో ఎంత కష్టం

ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. సామాజిక తనిఖీ, ఆ తర్వాత గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ.. మళ్లీ సర్వే, తనిఖీల నిర్వహణ చేస్తారు. ఈ ప్రక్రియల ద్వారా ఈ పథకం లబ్ధిదారులను ఎంపిక చేశారు. వైఎస్సార్ కాపు నేస్తం కింద ఈ ఏడాది రూ.353.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.