యాప్నగరం

నవరత్నాల అమలుకు ప్రత్యేక విభాగం.. త్వరలో కీలక మార్గదర్శకాలు!

Andhra Pradesh ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనతో తనదైన మార్క్ వేస్తున్నారు. అవినీతి, బంధుప్రీతికి తావులేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తామని ఆయన అంటున్నారు.

Samayam Telugu 7 Aug 2019, 12:14 pm
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవరత్నాల అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం కాగా, సీఎం ఆమోదం అనంతరం త్వరలో వీటిని విడుదల చేయనున్నారు. నవరత్నాలలో పేర్కొన్న అన్ని కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుంచి సక్రమంగా అమలవుతున్నాయా? లేదా? తదితర అంశాలను ఈ విభాగం పరిశీలిస్తుంది. నిధుల విడుదలతోపాటు ఇతర సమస్యలేవైనా ఉంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేలా చూస్తుంది. అయితే, ఆర్టీజీఎస్‌, ప్రణాళిక శాఖల్లో ఏదో ఒక దానికి ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.
Samayam Telugu ysjagan2


ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన రోజే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పేదలు, మధ్యతరగతి ప్రజల కష్టాలు, బాధలను చూశానని, ప్రతి కష్టాన్ని తీర్చేందుకు రెండు పేజీలతోనే ఎన్నికల మ్యానిఫెస్టో తీసుకొచ్చినట్టు తెలిపారు. నవరత్నాల్లో తొలి హామీ వృద్ధాప్యపు పింఛన్లను ఏడాదికి రూ.250 చొప్పున రూ.3,000 వేలకు పెంచుకుంటూ పోతామని తెలిపారు. జూన్ నుంచి పింఛన్లు రూ.2,250కు పెంచుతూ నిర్ణయం తీసుకున్న జగన్, వాటిని జులై 8న తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ జయంతి సందర్భంగా అందజేశారు.

జగన్ నవరత్నాల్లోని అంశాలు..

రైతులకు ఉచితంగా బోర్లు.. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.12,500 చొప్పున పంటసాయం.. రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా, రైతులకు సున్నా వడ్డీకే రుణాలు. అలాగే వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి రానుండగా, అన్ని రకాల వ్యాధులను దీని పరిధిలో చికిత్స అందజేస్తారు. కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు. మూడు దశల్లో మద్యపాన నిషేధం. ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం, శ్రీవారి సన్నిధిలో తలుపులు తీసే అవకాశం గొల్లలకు కల్పించడం లాంటివి జగన్ తన నవరత్నాల్లో పొందుపరిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.