యాప్నగరం

టీడీపీ ఆరోపణలు.. ఆ పార్టీది కేవలం మీడియా షో అంటూ డీజీపీ వ్యాఖ్యలు!

తమ పార్టీ ఎమ్మెల్యేలు కలవడానికి వెళ్తే డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటూ ఇటీవల టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై తాము స్పందించబోమని గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 20 Oct 2019, 10:49 am
అధికార పార్టీ నేతలకు మాత్రమే డీజీపీ అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని, తాము వెళ్తే కలవడానికి ఆయన ఇష్టపడటం లేదంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. టీడీపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై విమర్శలు చేస్తున్న ఓ రాజకీయ పార్టీ మీడియాలో షో చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. డీజీపీకి లేఖ రాశామంటూ ముందుగా మీడియాకు విడుదల చేసి.. రెండు మూడు రోజుల తర్వాత ఆ లేఖను తనకు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఆ లేఖలోని అంశాలన్నీ అంతకుముందే మీడియా, సోషల్ మీడియాలో తాను చదివినవేనని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu gautham


అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అపాయింట్‌మెంట్ ఇస్తున్నానని.. ప్రతిపక్ష నేతలకు ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న విమర్శలు సరికావని ఆయన అన్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల వారిని కలవలేకపోయానని తెలిపారు. గతంలో రెండు మూడుసార్లు ఆ పార్టీ నేతలు వచ్చి కలిశారని, ఇటీవల వారు వచ్చినప్పుడు నేను నా ఛాంబర్‌లో లేకపోవడం దురదృష్టమని వ్యాఖ్యానించారు.

తాను ప్రభుత్వ ఉద్యోగినని కేవలం ప్రజా సేవకుడిని మాత్రమే.. అంతకుమించి రాజకీయంగా నాకు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ వివరించారు. తమపై విమర్శలు చేస్తున్న పార్టీతో తాను వాదులాటకు దిగాలనుకోవడంలేదని అన్నారు. పోలీసులపై ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేవలం రాజకీయపరమైనవిగానే భావిస్తున్నామని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశంపైనా తగిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ గౌతమ్ తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.