యాప్నగరం

ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలకు తీవ్ర హెచ్చరికలు

AP Weather Report: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తీవ్ర హెచ్చరించింది.

Samayam Telugu 17 Oct 2020, 9:26 pm
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాబోయే నాలుగైదు గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ఈ నెల 20న భారీ వర్షాలు కురుస్తాయని భారత మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలోనూ వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది. ఇంకా దాని ప్రభావం నుంచి కోలుకోక ముందే తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాబోయే 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.