ఏపీ గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 59ను వెనక్కు తీసుకుంటున్నట్లు లాయర్ హైకోర్టుకు తెలియజేశారు. వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డ్రెస్కోడ్ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పడంతో.. కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
పోలీస్ శాఖలో నియామకాలు పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలని పిటిషన్ అన్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని.. పోలీసుల విధులు నిర్వర్తించే హోం గార్డులను సైతం పోలీసులుగా పరిగణించరని గుర్తు చేశారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడం.. కానిస్టేబుల్కు ఉండే అధికారాలు కట్టబెట్టడం చట్ట విరుద్ధమన్నారు.
ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసుల్ని హోంశాఖ పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీరిని సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మహిళా పోలీస్గా పేర్కొంటూ కానిస్టేబుల్కు ఉండే అధికారాలు, బాధ్యతలు ప్రకటించారు. జీవో నంబర్ 59ను తీసుకోచ్చారు.. మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని భావించారు. కానీ ఉన్నట్టుండి ప్రభుత్వం జీవోను వెనక్కు తీసుకుంది.