యాప్నగరం

ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లపై జగన్ సర్కార్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు

విజయవాడలో నివాసం ఉండకుండా తరచూ హైదరాబాద్, ఢిల్లీ వెళ్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎస్ నీలం సాహ్ని మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 14 Mar 2020, 8:37 pm
వారాంతాల్లో విజయవాడ విడిచి వెళ్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు హైదరాబాద్‌, ఢిల్లీలో నివాసం ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం మెమో జారీ చేశారు. కొందరు అధికారులు సచివాలయానికి సైతం హాజరు కాకుండా క్యాంపు కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తుండటంపై సీఎస్‌ అసహనం వ్యక్తంచేశారు.
Samayam Telugu AP-NEW-CS


కాగా, రాష్ట్ర రాజధాని అమరావతి వదలి తరచూ హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాలకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు వెళ్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నివేదిక అందడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పని లేకపోయినా కొందరు ఉన్నతాధికారులు తరచూ ఇలా వెళ్తున్నారని సీఎం జగన్ దృష్టికి రావడంతో ఆయన మండిపడినట్లు సమాచారం. అదే సమయంలో విజయవాడలో ఉండి కూడా కొందరు అధికారులు సచివాలయానికి రాకుండా క్యాంపు కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అలాగే కొందరు అధికారులు తరచూ సెలవులపై వెళ్తున్నారని, మరికొందరు అనుమతి లేకుండా సెలవు తీసుకుంటున్నారని సీఎం జగన్‌కు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడంతో సదరు అధికారులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఎస్ సూచించారు. కాగా, సీఎస్ ఆదేశాలతో పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ముందస్తుగా కొన్ని పర్యటనలను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.