యాప్నగరం

40 ఏళ్లు దాటితే ఈ జాగ్రత్తలు తప్పని సరి.. ప్రభుత్వం కీలక సూచనలు

కరోనా వైరస్‌పై 40 సంవత్సరాలు దాటిన వారికి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్‌ జవహర్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

Samayam Telugu 19 Jun 2020, 10:50 pm
రాష్ట్రంలో 40 సంవత్సరాలు పైబడిన హైరిస్క్ గ్రూపు వారు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్‌ జవహర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఊపిరితిత్తులు, ఆస్తమా సంబంధింత సమస్యలు ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే కాకుండా ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా తక్షణమే సమీపంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Samayam Telugu ఏపీ కరోనా వైరస్


ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ‘104’ టోల్‌ ఫ్రీ నంబర్‌, వైఎస్సార్‌ టెలీ మెడిసిన్‌ ‘14410’ నంబర్‌కు ఫోన్‌ చేయాలని జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే స్థానిక ఆశా వర్కర్‌, గ్రామ/ వార్డు వలంటీర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. గతంలో ఆస్తమా, ఆయాసం ఉన్నా ఏమీ కాలేదన్న ధీమాను విడనాడాలని జవహర్‌రెడ్డి హెచ్చరించారు. అలాగే బీపీ, సుగర్, గుండె జబ్బులు ఉన్న వారితో పాటు, హైరిస్క్ గ్రూపునకు చెందినవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వీరిలో శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా దగ్గర్లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో తక్షణం సంప్రదించాలని జవహర్‌రెడ్డి సూచించారు. వారికి పరీక్షలు చేసి తగిన వైద్యసేవల్ని అందిస్తారన్నారు. అవసరమైతే ఐసోలేషన్‌కు తరలిస్తారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడి 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సున్న వారు 14 మంది, 50 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు 22 మంది మరణించారని జవహర్‌రెడ్డి తెలిపారు. కాబట్టి 40 ఏళ్లకు పైబడిన వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.