యాప్నగరం

నేడే ఏపీ బడ్జెట్.. ఆ ఇద్దరు మంత్రులకు అరుదైన గౌరవం

ఏపీ ప్రభుత్వం మంగళవారం శాసనసభ, శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్.. బుధవారం బడ్జెట్‌పై చర్చ.. కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం.

Samayam Telugu 16 Jun 2020, 6:48 am
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లను శాసనసభ, శాసనమండలిలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటి సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు. కాగా, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వారి ఎన్నిక లాంఛనమే. అయితే రాష్ట్ర శాసనసభా వ్యవహారాలకు వారు వీడ్కోలు పలకనున్న తరుణంలో వారిద్దరి చేతుల మీదుగా బడ్జెట్ ప్రవేశపెట్టించాలని సీఎం జగన్ భావించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu సీఎం జగన్, మోపిదేవి, పిల్లి సుభాష్‌చంద్రబోస్


అలాగే, మంగళవారం గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రసంగం, బీఏసీ సమావేశం అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వైసీపీ సర్కార్.. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల వివరాలు..
  • ఈ నెల 16వ తేదీ (మంగళవారం) ఉదయం 10 గంటలకు వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగం
  • 11:30 గంటలకు స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం.
  • గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, చర్చ
  • గవర్నర్‌ ప్రసంగంపై ముఖ్యమంత్రి సమాధానం
  • 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
  • అదేసమయంలో శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
  • సాధారణ బడ్జెట్‌ అనంతరం సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ఆ శాఖ మంత్రి కన్నబాబు
  • శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మండలిలో ప్రతిపాదించనున్న మంత్రి మోపిదేవి వెంకటరమణ
  • ఈ నెల 17వ తేదీ (బుధవారం) ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం
  • సాధారణ బడ్జెట్‌పై పరిమిత స్థాయిలో చర్చ
  • చర్చకు మంత్రి సమాధానాలు - బడ్జెట్‌కు ఆమోదం - సభ వాయిదా
  • ఈ నెల 18 వ తేదీ (గురువారం) అసెంబ్లీ / మండలి సమావేశాలు ఉండవు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు చేస్తారు.
  • ఈ నెల 19వ తేదీ (శుక్రవారం) రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ - లెక్కింపు - ఫలితాల వెల్లడి - గెలుపొందిన సభ్యుల స్పందనలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.