యాప్నగరం

ఏపీలో జనతా కర్ఫ్యూ.. గవర్నర్ కీలక సూచనలు

ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు.

Samayam Telugu 20 Mar 2020, 6:17 pm
కరోనా వైరస్‌ (కోవిడ్ 19) ప్రభావం సాధారణ స్థితికి చేరే వరకు రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల సూచనలను పాటించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, మత పరమైన ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ హరిచందన్ రాజ్‌భవన్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మన కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కదలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉండాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.
Samayam Telugu Biswa-Bushan


కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాల్లోనే ఉండాలని.. అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా తమ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, అలాగే మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు. తమ నివాసాల్లోని వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే భయపడకుండా కాల్ సెంటర్‌ను సంప్రదించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు.

ఏపీ రాజ్‌భవన్‌ సందర్శనపై ఆంక్షలు..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్ ప్రవేశంపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగులు సహా రాజ్‌భవన్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది థర్మల్, నాన్-టచ్ ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ల ద్వారా స్కానింగ్ చేస్తున్నట్లు చెప్పారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. మరోవైపు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను వాయిదా వేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గవర్నర్ హరిచందన్ సైతం ఈ నెలాఖరు వరకు తన పర్యటనలను రద్దు చేసుకున్నారని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.