యాప్నగరం

YS Jagan సర్కారు కీలక నిర్ణయం.. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్‌ తొలగింపు,

Polavaram ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ బాధ్యతల నుంచి వెంకటేశ్వర రావును తప్పిస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ఇక మీద నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్‌గానే వ్యవహరించనున్నారు.

Samayam Telugu 28 Aug 2019, 8:21 pm
పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని భావిస్తోన్న జగన్ సర్కారు.. రీటెండరింగ్ పట్ల పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర జల వనరుల శాఖ వద్దంటున్నా.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. ఏపీ సర్కారు మాత్రం రీటెండరింగ్ నిర్వహించి తీరుతాం అంటోంది. రీటెండరింగ్‌కు వెళ్లడమే కాదు.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి చూపిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.
Samayam Telugu polavaram


ఈ క్రమంలోనే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును తొలగించింది. రాష్ట్ర నీటి పారుదల చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్న ఆయన.. పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పోలవరం కుడి, ఎడమ కాల్వల బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం.. నీటి పారుదల చీఫ్ ఇంజినీర్‌‌గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్యుడిగానూ ఆయన్ను తొలగించారు. ఆయన స్థానంలో పీపీఏ సభ్యుడిగా సుధాకర్‌ బాబుకు బాధ్యతలు అప్పగించారు.

15 ఏళ్లపాటు పోలవరం ప్రాజెక్టు కోసం శ్రమించిన వెంకటేశ్వర రావును ప్రభుత్వం తప్పించడం ఇంజినీరింగ్ వర్గాల్లో సంచలనంగా మారింది. వైఎస్ సహా నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఆయన పోలవరం కోసం పని చేశారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం కేంద్రం నుంచి పరిహారం తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.