యాప్నగరం

బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు.. నవయుగ సంస్థకు హైకోర్టు షాక్!

మచిలీపట్నం పోర్టు ఒప్పందం రద్దు విషయంలో నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది.

Samayam Telugu 2 Oct 2019, 10:50 am
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తప్పిస్తూ ఆగస్టు 8న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబరు 66ను సవాల్ చేస్తూ నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సెప్టెంబరు రెండో వారంలోనే వాదనలు ముగియగా, తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా, బందరు పోర్టు ఒప్పందం రద్దుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి శ్యాంప్రసాద్ ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఇంధన, పెట్టుబడుల(పోర్ట్‌) శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోర్టుల డైరెక్టర్‌, మచిలీపట్నం తహశీల్దార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.
Samayam Telugu aphigh


అలాగే, పోర్టు నిర్మాణ వ్యవహారంలో టెండర్‌ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని, బిడ్‌ను ఖరారు చేయవద్దని ప్రభుత్వానికి తెలిపింది. అఫిడ్‌విట్ దాఖలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 25కు వాయిదా వేసింది. నవయుగ అనుబంధ పిటిషన్‌పై ఎటువంటి సానుకూల ఉత్తర్వులు జారీ చేయట్లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనులను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, ఈ విషయంలో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని పేర్కొంది.

అంతకు ముందు తన వాదనల్లో బందరు పోర్టు ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని నవయుగ సంస్థ హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 66 అమలును నిలిపేయాలని కోరిన ఆ సంస్థ తరఫు లాయర్ పి.విల్సన్‌.. పనులను ఇతరులకు అప్పగించకుండా చూడాలని అభ్యర్థించారు. ఎలాంటి నోటీసుగానీ, వివరణ కోరకుండానే ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారని తెలిపారు. అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 5,324 ఎకరాల భూమిని అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో 932 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని చెప్పారని, తమకు అప్పగించిన 412 ఎకరాలకు సైతం కనీస సౌకర్యాలు కల్పించలేదని వివరించారు.

సొంత తప్పిదాన్ని ప్రభుత్వం మాపై నెడుతోందని, నవయుగ సంస్థ నిబంధనల ఉల్లంఘంచలేదని పేర్కొన్నారు. ఒకవేళ అలా జరిగినా సరిదిద్దుకోవడానికి నోటీసిలివ్వాలి కానీ అదీ చేయలేదన్నారు. నిబంధనల ప్రకారం ఒప్పందం రద్దుచేస్తూ జీవో జారీచేయడానికి ముందు మూడు దశలను అనుసరించాల్సి ఉండగా.. తొలి దశలోనే రద్దు చేశారన్నారు. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ఆకస్మికంగా ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు తమకు ఉందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.